ఎంపీగా వినోద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

21 Mar, 2019 15:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించుకుందాం

ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తున్నాయి

ప్రజలు మెచ్చిన పథకాలు తెచ్చినం..

ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హుస్నాబాద్‌రూరల్‌: అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని, కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరువు నేలను తడుపేందుకు గోదావరి జలాలు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రాజెక్టులను నిలిపివేయడానికి కుట్రలు చేసి కేసులు వేస్తున్నారన్నారు. 30 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణకు చుక్క నీరు ఇవ్వకుండా ఆంధ్రాకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చి అభివృద్ధికి పైసలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైందన్నారు.  

కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి వర్షకాలం వరకు కరువు నేల తడిపే గౌరవెల్లి, మిడ్‌ మానేరు ప్రాజెక్టులకు గోదావరి జలాలను తరలించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కింద యాసంగి పంటలకు సాగు నీళ్లు అందించి రైతుల సాగు నీటి కష్టాలను తీర్చుతామని చెప్పారు.   లోక్‌సభ ఎన్నికల్లో కూడ కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించాలన్నారు.


కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంటే.. 
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఏడుసార్లు  మెజార్టీ రాలేదని, 2014లో బీజేపీకి మెజార్టీ వచ్చినా  ఒక్క సంక్షేమ పథకం కూడ అమలు చేయలేదని కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి అన్ని  రాష్ట్రాల్లో కాపీ కొడుతున్నారన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ రాదని ప్రాంతీయ పార్టీలకే అధిక సీట్లు వస్తాయన్నారు. ప్రాంతీయ పార్టీలు కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌గా ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్‌కు లక్ష మెజార్టీ అందించాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్‌ నుంచి 200 మంది టీఆర్‌ఎస్‌లోకి చేరారన్నారు.   మంత్రి ఈటల రాజేందర్‌ పుట్టిన రోజును పురస్కరించుకోని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ కేక్‌కట్‌ చేశారు. ఈ సమావేశంలో బస్వారాజు రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ,  రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు తిరుపతిరెడ్డి, దేవందర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీలు భూక్య మంగ, శాలిని, అందె సుజాత, సంగ సంపత్, జెడ్పీటీసీలు రాంచందర్‌నాయక్, శేఖర్, నాయకులు కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆన్వర్‌పాషా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు