గౌరవాన్ని కాపాడుకుందాం..

28 Mar, 2019 14:25 IST|Sakshi
కార్యకర్తలు బహూకరించిన గదతో హరీశ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి,

ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం..

జోడెడ్లలాగా సిద్దిపేటను అభివృద్ధి చేస్తాం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సాక్షి, నంగునూరు(సిద్దిపేట): మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ఉద్యమాల గడ్డ, రికార్డుల అడ్డగా పేరుగాంచిన సిద్దిపేట గౌరవాన్ని కాపాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జిల్లా ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన ప్రభాకర్‌రెడ్డితో కలసి నంగునూరు, గజ్వేల్, దౌల్తాబాద్, మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహించారు. నంగునూరు రోడ్‌షోలో పలు గ్రామాల నుంచి వచ్చిన మహిళలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బోనాలు, డప్పుచప్పుళ్లు, పీర్లతో ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్వీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై పూలవర్షం కురిపించారు.  

పలువురు నాయకులు గజమాలతో సన్మానించి గద, మెమొం టోను అందజేశారు. బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకుపైగా మెజార్టీ ఇచ్చి తనను దీవించారని అలాగే ప్రభాకర్‌రెడ్డిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించి మెదక్‌ను నంబర్‌ వన్‌ స్థానంలో నిలపాలన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి నియోజకవర్గంలో లక్ష మెజార్టీ తెస్తామని ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారన్నారు. సిద్దిపేటకు పాస్‌పోర్ట్‌ కేంద్రం, కేంద్రియ విద్యాలయంతోపాటు  రోడ్లను మంజూరి చేసిన ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే జోడెడ్లలాగ పని చేసి మెదక్‌తో పాటు సిద్దిపేటను అభివృద్ధి చేస్తామన్నారు. 


హరీశ్‌ అడుగుజాడల్లో నడుస్తా..
తనను ఎంపీగా గెలిపిస్తే సిద్దిపేటను అభివృద్ధిలో నంబర్‌ వన్‌గా నిలిపిన హరీశ్‌రావు అడుగుజాడల్లో నడుస్తానని క్తొత ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీర్, హరీశ్‌రావు దయతోనే రెండోసారి లోక్‌సభకు పోటీచేసే అవకాశం వచ్చిందన్నారు. ఎంపీగా గెలవగానే హరీశ్‌రావులా కష్టపడి పని చేస్తానన్నారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తామన్నారు. అనంతరం పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా హరీశ్‌రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్‌ చైర్మన్‌ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, రాధకిషన్‌శర్మ, లింగంగౌడ్, వెంకట్‌రెడ్డి, మల్లయ్య, రమేశ్‌గౌడ్, మమత, జయపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, పురేందర్, వెంకట్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి,  సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

             

మరిన్ని వార్తలు