మెట్రో నుంచి ఎల్ అండ్ టీని తప్పించేందుకు కుట్ర

21 Sep, 2014 13:27 IST|Sakshi
మెట్రో నుంచి ఎల్ అండ్ టీని తప్పించేందుకు కుట్ర

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజులు ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి పదే పదే అబద్దాలు చెప్పి... వాటిని నిజాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. దమ్ముంటే మెట్రో రైలు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.

ఎల్ అండ్ టీ సంస్థకి ఆంధ్ర రాజధానిని ఎరవేసి... ఇక్కడి మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థను తప్పించి ఆంధ్ర రాజధానికి పంపించాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు విక్రయించిన భూములపై చర్చకు సిద్ధమేనా అంటూ ప్రశ్నించారు. రేవంత్రెడ్డిలాంటి నాయకుల వల్లే తెలంగాణలో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జి బాలరాజు అన్నారు.

మరిన్ని వార్తలు