టీఆర్‌ఎస్‌ నేతల బాహాబాహీ

7 Jun, 2018 09:19 IST|Sakshi
దుస్తులు పంపిణీ చేస్తున్న హోంమంత్రి నాయిని, దాడిలో చొక్కా చిరిగిన అబ్రార్‌ హుస్సేన్‌

హోంమంత్రి సమక్షంలోనే పరస్పర దాడులు 

కవాడిగూడ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు కానుకగా ప్రభుత్వం అందజేస్తున్న దుస్తుల పంపిణీలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది.సాక్ష్యాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు పరస్పరదాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిలో ఒక నాయకుడిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... రంజాన్‌ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు బడీమసీదు వద్ద  మసీదు కమిటీ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, ఎమ్మెల్సీ సలీం, స్థానిక టీఆర్‌ఎస్‌ నేత షరీఫుద్దీన్‌ను ఆహ్వానించారు.

నాయిని వేదిక వద్దకు వచ్చే సమయంలో జనం గుమిగూడటంతో షరీపుద్దీన్‌ వారిని పక్కకు జరగాలని కోరాడు. అక్కడే నిలుచుని ఉన్న స్థానిక నాయకుడు అబ్రార్‌ హుస్సేన్‌ ఆజాద్‌ పక్కకు జరగాలని చెప్పడంతో ఆగ్రహించిన అబ్రార్‌ హుస్సేన్‌ షరీపుద్దీన్‌తో వాగ్వివాదానికి దిగాడు.  ఇరువురి మధ్య మాటామాట పురడగంతో పరస్పర దాడులకు దిగారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న ముషీరాబాద్‌ సీఐ టీ.శ్రీనా«థ్‌రెడ్డి జోక్యం చేసుకొని అబ్రార్‌ హుస్సేన్‌ను  స్టేషన్‌కు తరలించాడు. అనంతరం తోపులాట మధ్యే హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చేతుల మీదగా దుస్తుల పంపిణి కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంల్జో ముఠా గోపాల్‌ ,  శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

  

మరిన్ని వార్తలు