గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఆధిక్యం
అత్యధిక ఏరియాల్లో గులాబీ జెండా రెపరెపలు
11 ఏరియాలకుగానూ తొమ్మిదింటిలో విజయం
మందమర్రి, భూపాలపల్లిలో ఏఐటీయూసీ గెలుపు
ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు
94.93 శాతం పోలింగ్ నమోదు
అత్యధికంగా ఇల్లెందులో 98.47 శాతం
టీబీజీకేఎస్ నేతలు డబ్బులు పంచారని ఏఐటీయూసీ ఆందోళన
సాక్షి, కొత్తగూడెం, నెట్వర్క్
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) హవా కొనసాగించింది. అత్యధిక ఏరియాలను కైవసం చేసుకుంది. సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలలో గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 52,534 ఓట్లకు గాను 49,873 మంది (94.93 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లెందులో అత్యధికంగా 1,112 మందికి గాను 1,095 మంది (98.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని ఏరియాల్లో సుమారు రెండు గంటలు ఆలస్యంగా ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. అత్యధిక ఏరియాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీబీజీకేఎస్ ఆధిక్యత చూపింది. ఇల్లెందు ఏరియా ఫలితాలు ముందుగా తేలగా.. అనంతరం మిగతా ఏరియాల ఫలితాలు వెలువడ్డాయి. గురువారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తుది ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి.
ఏరియాలవారీగా విజయం/మెజారిటీ వివరాలు..
రెండింటి మధ్యే పోటీ..
మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఆగస్టు 21న సింగరేణి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఈ నెల 3 వరకు ప్రచారం జరిగింది. అధికార, విపక్షాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. టీబీజీకేఎస్ తరఫున టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు రంగంలోకి దిగగా.. విపక్షాల తరఫున కూడా ముఖ్య నేతలు ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే పలు పథకాలను ప్రకటించడంతో పరిస్థితి టీబీజీకేఎస్ వైపు మొగ్గింది. వివిధ యూనియన్ల నుంచి టీబీజీకేఎస్లోకి వలసలు జరిగాయి.