నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం 

19 Jun, 2019 04:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమావేశానికి హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. జూలై నెలాఖరులోగా మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో.. ఆ దిశగా పార్టీ శ్రేణులను సన్నద్దం చేసే అవకాశం ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా సభ్యత్వ నమోదు గురించి సూచనలు చేయనున్నారు.

అలాగే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలు నిర్మించే అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. 2018 ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా.. జిల్లా స్థాయిలో మాత్రం ఇంకా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే కార్యవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా కార్యవర్గాల ఏర్పాటుపైనా చర్చించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయలోపంతో ఓట మి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీల నియామకం వంటి అంశాలు  ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. 

>
మరిన్ని వార్తలు