బ్యాలెట్‌కు 8 గుర్తులే

6 Jun, 2018 02:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏడుగురు అభ్యర్థులు దాటితే రెండో బ్యాలెట్‌ పేపర్‌

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్‌లో కీలకమైన బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల అధికారులను ఆదేశిం చింది. గ్రామ పంచాయతీల సంఖ్యకు అను గుణంగా ముందుగానే బ్యాలెట్‌ పేపర్లను ముద్రించుకుని సిద్ధంగా ఉండాలని సూచిం చింది. ఒక బ్యాలెట్‌ పేపరులో గరిష్టంగా ఎనిమిది గుర్తులు ఉండాలని స్పష్టం చేసింది. ఏడుగురు అభ్యర్థులతో పాటు నోటా గుర్తును ముద్రించాలని పేర్కొంది. 

పోటీలో ఉండే వారు ఏడుగురి కంటే ఎక్కువ మంది ఉంటే రెండు బ్యాలెట్‌ పేపర్లు ముద్రించాలని స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థుల గుర్తుల చివరలో నోటా ఉండాలని సూచించింది. రెండు బ్యాలెట్‌ పేపర్లు ఉంటే రెండో బ్యాలెట్‌ చివరలో నోటా ముద్రిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల పోలింగ్‌ బ్యాలెట్‌ పేపర్లలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల పంచా యతీ అధికారులను ఆదేశించింది. 

బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ విషయంలోనూ పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ముద్రణకు ఆర్డర్‌ ఇచ్చే సమయంలో ఇద్దరు పోటీలో ఉండేవి 10 శాతం ఉండాలని పేర్కొంది. ముగ్గురు పోటీలో ఉండేవి 17 శాతం, నలుగురు ఉండేవి 25 శాతం, ఐదుగురు ఉండేవి 17 శాతం, ఆరుగురు ఉండేవి 11 శాతం, ఏడుగురు ఉండేవి 8 శాతం, ఎనిమిది మంది ఉండేవి 4 శాతం, తొమ్మిది మంది ఉండేవి 3 శాతం, పది మంది ఉండేవి 2 శాతం, 11 మంది ఉండేవి ఒక శాతం ముంద్రించి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇదే పద్ధతిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా పోలింగ్‌కు ఇబ్బంది లేకుండా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించాలని సూచించింది. 
 

మరిన్ని వార్తలు