స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌పై విచార‌ణ వాయిదా

15 Jul, 2020 14:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌పై స్టే కొన‌సాగుతూనే ఉంది. సచివాలయం కూల్చివేత అంశంలో అడిషనల్‌ రిపోర్టు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు పిటిషనర్‌ను కోరింది. సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భవనాల కూల్చివేతకు రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్‌ అనుమతి అవసరం లేదని పలు తీర్పులు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్‌ చిక్కుడు ప్రభాకర్‌ రిప్లై దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం-2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్‌ రిజర్వ్‌మెంట్స్‌ తీసుకోవాలని పిటిషనర్‌ తెలుపగా, లీగల్‌ రిజర్వ్‌మెంట్స్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు పిటిషనర్‌ను కోరింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలపాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. (15 వరకు సచివాలయ కూల్చివేత ఆపండి: హైకోర్టు)

భవనాల కూల్చివేతకు కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోలేదని పిటిషనర్‌ పేర్కొనగా, ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి అవసరమని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. భవనాల కూల్చివేతకు అనుమతి అవసరం లేదని కేవలం భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి అవసరమని ఈ సందర్భంగా ఏజీ పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని, నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టుకు తెలిపారు. జీహెచ్ఎంసీ, స్థానిక అధికారులు, పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు తీసుకున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. కాగా సోలిసిటర్ జనరల్ రేపు విచారణకు హాజరు కావాలని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. (యశోద, కిమ్స్‌పై ఏం చర్యలు తీసుకున్నారు?)

>
మరిన్ని వార్తలు