ఐటీ కంపెనీలకు ఆ చట్టం వర్తించదు

10 May, 2020 08:34 IST|Sakshi

‘షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌’పై హైకోర్టు తీర్పు 

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ పాలసీ ప్రకారం నెలకొల్పే కంపెనీలు షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్ట పరిధిలోకి రావని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఐటీ కంపెనీ ఉద్యోగుల తొలగింపు వ్యవహారాలపై కార్మిక శాఖకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం తమకు లేదని పేర్కొంది. ఐటీ కంపెనీలకు షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం 2002లోనే ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కేసులో ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది. 

తనను అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ కాగ్నిజెంట్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేసిన పి.అప్పలనాయుడు వికారాబాద్‌లోని కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 2011లో ఉద్యోగంలో చేరితే 2013లో ఆ కంపెనీ తన వివరణ కోరకుండా తొలగించిందంటూ 48 (1)  కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన కార్మిక శాఖ.. అప్పలనాయుడుకు 2017 ఏప్రిల్‌ వరకు జీతం చెల్లించాలని ఆ కంపెనీని ఆదేశించింది. దీంతో రిట్ పిటిషన్‌‌ దాఖలు చేసిన సదరు కంపెనీ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించారు.

మరిన్ని వార్తలు