ఇంటర్‌లో గ్రేస్‌ మార్కులు

6 Jul, 2020 02:33 IST|Sakshi

కనీస మార్కులతో అంతా పాస్‌!

ఇంటర్‌ ఫెయిలైన వారి విషయంలో బోర్డు ఆలోచన

ప్రభుత్వ ఆమోదానికి ఫైలు సీఎం ఓకే చేయగానే ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్‌ మార్కులను (గ్రేస్‌ మార్కులు) ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రతిపాదనలు పంపించినా... కనీస పాస్‌ మార్కులు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఇబ్బందికరమన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంటర్మీడియట్‌ బోర్డు కూడా మూడు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించింది. అందులో ప్రభుత్వం ఏ ప్రతిపాదనకు ఓకే అంటే దానిని అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి)

వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన 3,29,340 మంది విద్యార్థులు అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను పక్కన పెట్టి... 1,61,710 మంది ద్వితీయ సం వత్సర విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించా లని మరో ప్రతిపాదన చేశారు. ఇక ఈ రెండూ వద్దనుకుంటే విద్యార్థులకు కనీస పాస్‌ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేసే ప్రతిపాద నను పంపించారు. ఆ మూడు ప్రతిపాదన లతో కూడిన ఫైలు ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం పంపించారు. అయితే గతంలో ఉన్నత స్థాయిలో జరిగిన భేటీలో ప్రస్తుత కరోనా పరి స్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయానికే అధికారులు వచ్చారు. 

10 నుంచి 20 వరకు గ్రేస్‌ మార్కులు కలపాలనే ఆలోచన చేసినా... అప్పటికీ పాస్‌ కాని వారు కోర్టులకు వెళితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అందరికీ పాస్‌ మార్కులు వేయాలనే ప్రతిపాదన వైపే మొగ్గారు. మొత్తం మూడు ప్రతిపాదనలతో సీఎం ఆమోదానికి ఫైలును పంపించారు. సీఎం ఓకే చెప్పాక ఇంటర్‌ బోర్డు తదుపరి కార్యాచరణను చేపట్టనుంది. ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులకు 100 మార్కులకుగాను 35 మార్కులు వేసి పాస్‌ చేయనున్నారు. మ్యాథమెటిక్స్‌లో గరిష్ట మార్కులు 75కు గాను 27 మార్కులను వేసి పాస్‌ చేస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 60 మార్కులకు 21 మార్కులు వస్తే పాస్‌ కాబట్టి ఆ మార్కులను వేసి విద్యార్థులందరిని పాస్‌ చేయనున్నారు. మరోవైపు ఇపుడు విద్యార్థులు మార్చిలో పాస్‌ అయినట్లు ఇవ్వాలా? జూన్‌/జూలైలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ కింద పాస్‌ అయినట్లు ఇవ్వాలా? అన్న విషయంలోనూ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు.

మరిన్ని వార్తలు