మార్చి 13 నుంచి పీజీఈసెట్‌ దరఖాస్తులు

8 Feb, 2019 02:27 IST|Sakshi

ఏప్రిల్‌ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల ఫీజు రూ. 1,000గా నిర్ణయం

మార్చి 6న నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంఈ/ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీజీఈసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మార్చి 13 నుంచి స్వీకరించాలని టెస్టు కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మే 28 నుంచి 31 వరకు ప్రతి రోజూ రెండు దఫాలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఉదయం 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్, వరంగల్‌ ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని 129 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్‌ కోర్సుల్లో, 96 కాలేజీల్లో ఎంఫార్మసీ కోర్సులో, 14 కాలేజీల్లో ఫార్మ్‌–బీ (పీబీ) కోర్సులో, 3 కాలేజీల్లో మాస్టర్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ. 1000గా (ఎస్సీ, ఎస్టీలకు రూ. 500) నిర్ణయించారు. 120 ప్రశ్నలతో 2 గంటల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 6న జారీ చేయనున్నారు. పూర్తి వివరాలను http://pgecet.tsche.ac.in, http:// www.tsche.ac.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, టెస్టు కమిటీ చైర్మన్‌ ఎస్‌.రామచంద్రం, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు, సెట్‌ కన్వీనర్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

షెడ్యూలు వివరాలు.. 

  • 13–3–2019 నుంచి దరఖాస్తుల స్వీకరణ 
  • 30–4–2019 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 
  • 25–5–2019 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ 
  • 22–5–2019 నుంచి 27–5–2019 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌.  
మరిన్ని వార్తలు