కార్మికుల సమ్మెకు పలు ఉద్యోగ సంఘాల మద్దతు

12 Oct, 2019 10:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా అన్ని జిల్లాలో కార్మికులు యధావిధిగా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు కార్మికులు డిపోల ఎదుట మౌన దీక్ష చేయనున్నారు. అదే విధంగా బీజేపీ అధ్వర్యంలో బస్‌ భవన్‌ ముందు ధర్నా నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఖమ్మం మున్సిపల్‌ కార్మికులు తమ విధులను బహిష్కరించి.. మున్సిపల్‌ కార్యాలయం నుంచి డిపో వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం మద్దతు పలుకుతుందని జీ దామోదర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు బర్తరఫ్‌ అయినట్లుగా ప్రకటించి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎనిమిది డిపోల పరిధిలో 672 బస్సులు, 2890 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొన్నడం వల్ల ఇప్పటి వరకు రూ. 7 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు