బస్‌ కండక్టర్‌ను అభినందించిన పోలీసులు

16 Feb, 2020 08:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఎస్‌ఆర్టీసీ దిల్‌సుఖ్‌నగర్‌ డిపోలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ అనే మహిళా కండక్టర్‌ నిజాయితీ చాటుకున్నారు. బస్‌లో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ.20 వేల నగదు బ్యాగ్‌ను మలక్‌పేట పోలీసుల సాయంతో తిరిగి అతనికి అప్పగించారు. శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో..  బస్సు సికింద్రాబాద్‌ నుంచి సరూర్‌నగర్‌ వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు స్టేజీ వచ్చిందనే తొందరలో క్యాష్‌ బ్యాగ్‌ను సీట్లోనో వదిలేసి బస్‌ దిగిపోయాడు. కండక్టర్‌ ప్రవీణకు ఆ బ్యాగ్‌ కనిపించడంతో దానిని తెరచి చూశారు. దాంట్లో రూ.20 వేల నగదు ఉండటంతో మలక్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారి సాయంతో బాధితునికి బ్యాగ్‌ అందించారు. ప్రవీణ నిజాయితీపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఆమెను అభినందించారు. పోయిందనుకున్న సొమ్ము తిరిగి దక్కడంతో ప్రయాణికుడు కండక్టర్‌ ప్రవీణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

మరిన్ని వార్తలు