చక్రం తిరుగుతోంది చందాలతోనే..

26 Apr, 2019 01:40 IST|Sakshi

అత్యంత గడ్డు పరిస్థితిలో ఆర్టీసీ

చిల్లిగవ్వ లేక సాగని అభివృద్ధి పనులు

డిపోల్లో పనులకు కార్మికుల చేయూత

వారిచ్చే చందాలతోనే పనుల నిర్వహణ.. అడిగినా అభివృద్ధి నిధులివ్వని ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) పరిస్థితి అత్యంత దయ నీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కార్మికులకు జీతాలు ఇవ్వడానికే దిక్కులు చూస్తున్న సంస్థ.. ఏవైనా పనులు చేయించాలంటే వారి వద్దే చేయి చాస్తోంది. కార్మికులు తమ జేబులో నుంచి డబ్బులు తీస్తే తప్ప.. సంస్థలో అభివృద్ధి పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 8 దశాబ్దాల్లో ఎన్నడూ ఇంతటి గడ్డు పరిస్థితి లేదు. నష్టాలు వచ్చినప్ప టికీ.. సిబ్బంది వేతనాలు, ఇతరత్రా అభివృద్ధి పనులకు అంతగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారింది. సంస్థ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో కొత్త బస్సులు కొనలేక డొక్కు బస్సులతోనే నెట్టు కొస్తోంది. కార్మికుల కోసం డిపోల పరిధిలో ఏవైనా పనులు చేయాల్సి వస్తే ‘బస్‌ భవన్‌’ నిస్సహాయంగా చూస్తోంది. దీంతో కార్మికులే చందాలు వేసుకుని పనులు చేసుకుంటున్నారు.

డిస్పెన్సరీ ఏర్పాటుకు...
వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని కార్మికులందరి చేతిలో ‘క్లినిక్‌ డిస్పెన్సరీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌’ కూపన్లే కనిపిస్తున్నాయి. హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల కోసం విశాలమైన డిస్పెన్సరీ ఉంది. వరంగల్‌–1 డిపో మేనేజర్‌ కార్యాలయం ఉన్న భవనం రెండో అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. అయితే, దీనికి లిఫ్టు వసతి లేదు. కనీసం ర్యాంపు కూడా లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం వచ్చే కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పైకి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్‌ మేరకు డిస్పెన్సరీని రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం ఉన్న భవనంలో కింద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, ఆ నిధులు ఇచ్చేందుకు ఆర్టీసీ వద్ద ఎలాంటి ఫండ్‌ లేదు. ఏరోజుకారోజు టికెట్ల రూపంలో వచ్చే డబ్బులు తప్ప ఆర్టీసీ వద్ద ఎలాంటి నిధులూ లేవు. కార్మికుల భవిష్యనిధి, ఆర్టీసీ పరపతి సహకార సంఘం, పదవీ విరమణ, చనిపోయిన కార్మికులకు ఇచ్చే థ్రిఫ్ట్‌ అండ్‌ బెన్వలెంట్‌ ఫండ్‌ను కూడా వదలకుండా వాడేసుకుంటున్న దుస్థితి నెలకొంది. దీంతో ఇలాంటి అభివృద్ధి పనులకు ఇవ్వడానికి నయా పైసా కూడా సంస్థ వద్ద లేదు. ఆర్టీసీ కేంద్ర కార్యాలయం నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవటంతో వరంగల్‌ రీజియన్‌ అధికారులు స్థానిక కార్మిక సంఘాలతో సమావేశమై చందాలు వేసుకుని ఈ పని చేయించుకోవాలని నిర్ణయించారు. వరంగల్‌ రీజియన్‌ పరిధిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు రూ.50 చొప్పున చెల్లించే విధంగా రశీదు పుస్తకాలు ముద్రించారు. వాటిని డిపోలకు పంపిణీ చేసి చందాలు వసూలు చేస్తున్నారు. లక్కీ డ్రా తీసి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామంటూ కూపన్లపై ముద్రించారు. దీంతో కొందరు కార్మికులు పది వరకు కూపన్లు తీసుకుంటున్నట్టు తెలిసింది. డిస్పెన్సరీ చాలా ఉపయోగకరమైంది కావటంతో కొంతమంది స్వచ్ఛందంగా అదనంగా చందాలు రాస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న మొత్తంతో కొత్త డిస్పెన్సరీ పనులు చేయిస్తున్నారు.

డ్రైవర్‌డేకు చందాలే దిక్కు...
కార్మికుల సంక్షేమం, ఇతర ప్రత్యేక రోజులకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. డ్రైవర్‌ దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ రోజు డ్రైవర్ల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవటంతోపాటు వారికి బహుమతులు ఇచ్చి, ఉత్తమ డ్రైవర్లను సన్మానిస్తారు. ఇలాంటి కార్యక్రమాలకు ఆర్టీసీనే ఖర్చు భరిస్తుంది. కానీ నిధులు లేక ఇటీవల కార్మికులే చందాలు వేసుకుని ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వరంగల్‌ రీజియన్‌లో ఇలా రూ.50, రూ.100 చొప్పున చందాలు వేసుకుని అన్ని డిపోల పరిధిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో అన్ని డిపోల్లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇందుకోసం చాలాచోట్ల భారీ ట్యాంకులు ఏర్పాటు చేసి కార్మికులకు మంచినీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ట్యాంకులు కొనడానికి నిధులు లేకపోవటంతో చాలాచోట్ల కార్మికులే చందాలు వేసుకున్నట్టు సమాచారం.

అవినీతికి ఆస్కారం కాదా?
అభివృద్ధి పనుల పేరుతో కార్మికుల నుంచి చందాలు వసూలు చేయటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అది అవినీతికి దారి తీస్తుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికుల నుంచి చందాలు వసూలు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత, భవిష్యత్తులో ఆ ఖర్చు తాలూకు బిల్లులు పెట్టి ఆర్టీసీ నిధుల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ భాగస్వామ్యంలో ఇలాంటి పనులు జరగడం సంతోషంగా ఉందని అనేవారూ ఉన్నారు. గతంలో తమ జీతాల నుంచి కొంత మొత్తం మినహాయించి కొత్త బస్సులు కొన్నారని, ఇప్పటికీ అవి తిరుగుతున్నాయని, వాటిని చూస్తే ఆనందం కలుగుతుందని పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి నిర్మాణ సమయంలో కూడా తాము చందాలు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలేం చేస్తున్నారు..?
వాస్తవానికి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం గతంలోనే ఎమ్మెల్యేలకు ఆర్టీసీ లేఖలు రాసింది. గత ప్రభుత్వ హయాంలో ఈటల రాజేందర్, మధుసూదనాచారి, మహేందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ సహా పది పన్నెండు మంది మాత్రమే కొంతమేర ఆర్టీసీకి నిధులిచ్చారు. మిగిలినవారు ఎవరూ స్పందించలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఒక్కరు కూడా ఆర్టీసీకి నిధులు కేటాయించలేదు. కొన్ని చోట్ల అధికారులు విన్నవించినా ఎమ్మెల్యేలు స్పందించలేదు.
 

మరిన్ని వార్తలు