సమ్మెకు సంఘీభావం తెలిపిన లక్ష్మణ్‌, వివేక్‌

15 Oct, 2019 11:52 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీ వివేక్‌లు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుని కేసీఆర్‌ అగ్గితో గోక్కుంటున్నాడన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులను సెల్ఫ్‌ డిస్మిస్‌ చేయడం కాదు.. ప్రజలే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేస్తారని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌ ఎన్నికల కోసమే కేకే చర్చల డ్రామా ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని రోజులు దసరా సెలవులు ఇచ్చిన ప్రభుత్వమే లేదన్నారు. టీఆర్‌ఎస్‌ మెడలు వంచే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కార్మికుల జీతాలు ఆపిన కేసీఆర్‌.. ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు ఆపాడా అని ప్రశ్నించారు.

సమ్మెను బూచిగా చూపి.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని మంత్రులు సమ్మె గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కేసీఆర్‌ మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు బీజేపీ వారికి అండగా ఉంటుందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు