ఆర్టీసీ సమ్మె : ప్రభుత్వ తీరుతో ఆగిన మరో గుండె

4 Nov, 2019 08:11 IST|Sakshi

సాక్షి, నల్గొండ: ప్రభుత్వ తీరుతో ఆందోళనకు గురైన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. దేవరకొండ బస్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లి. ఆయనకు ఇద్దరు సంతానం. నిన్నరాత్రి వరకు జైపాల్‌రెడ్డి సమ్మె కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు అంబులెన్సులో హైదరాబాద్‌కి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. 

జైపాల్‌రెడ్డి మృతదేహంతో డిపో ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. పరామర్శించడానికి వచ్చిన డిపో మేనేజర్‌ను అడ్డుకున్నారు. డ్యూటీకి వస్తున్న తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లని కూడా కార్మికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తవాతవరణం నెలకొంది. జైపాల్‌రెడ్డి మృతితో సూర్యాపేట డిపో వద్ద కూడా ఉద్రికత్త చోటుచేసుకుంది. సీపీఎం కార్యకర్తలు బస్సులను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని, ఆందోళనకారులను అరెస్టు చేశారు. మరో ఆరునెలల్లో రిటైర్ కానున్న జైపాల్‌రెడ్డి ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆందోళన గురయ్యాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. జైపాల్‌రెడ్డి మృతి నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేడు (సోమవారం) దేవరకొండ పట్టణ బంద్ పిలుపునిచ్చింది.

మరిన్ని వార్తలు