​కార్మికులను గందరగోళంలోకి నెట్టొద్దు

23 Oct, 2019 14:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర‍్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి సహా పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘విలీనంపై వెనక్కి తగ్గినట్లు ఎక్కడైనా చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లపై చర్చలకు రావాలి. కార‍్మికులు, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. కార్మికులను గందరగోళంలోకి నెట్టొద్దు’ అని అన్నారు.

2004లో టీడీపీ ఓటమికి ఆర్టీసీ సమ్మె కారణమని ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపాదించిన 26 డిమాండ్లు తమకు ప్రాధాన్యమే అని అన్నారు. ధనిక రాష్ట్రంలో ధనం ఏమైందని, అదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ఎలా చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. కార్మికులను, ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలకు, ఆర్టీసీ సమ్మెకు సంబంధం లేదని, కార్మికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని సూచించారు. టీఎంయూ కార్మిక సంఘం జెండా రంగు మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు. గులాబీ జెండా మోసింది తామేనని అన్నారు. కంటితుడుపు కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించా లని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక అందిన తర్వాత చర్చలపై ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకోనుంది. ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు అదే విషయాన్ని నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో బస్‌ భవన్‌లో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు.

మరిన్ని వార్తలు