ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం!

20 Nov, 2019 01:27 IST|Sakshi
మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తదితరులు

ఎటూ తేల్చని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ

అభిప్రాయ సేకరణలో కార్మికుల నుంచి భిన్న స్వరాలు

ప్రభుత్వం బేషరతుగా చేర్చుకుంటే విధుల్లో చేరేందుకు మొగ్గు?

ఇన్ని రోజుల సమ్మెకు సార్థకత ఉండకపోతే ఎలా అంటున్న కొందరు

నేడు న్యాయవాదులతో చర్చ... తుది నిర్ణయం ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై విషయంలో కార్మిక సంఘాల జేఏసీ సందిగ్ధంలో పడింది. కేసు కార్మిక న్యాయస్థానానికి చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం జేఏసీ ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయింది. హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి బుధవారం న్యాయవాదులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటివరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.

విడివిడిగా సమావేశాలు... ఒకటిగా సమాలోచనలు..
సమ్మెకు సంబంధించి హైకోర్టులో వాదనలు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మంగళవారం కార్మికుల్లో కలకలం మొదలైంది. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వస్తాయన్న ఆశతో ఉన్న కార్మికులు... తాజా పరిణామాలతో కొంత ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం మాత్రం సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని సమ్మె విషయాన్ని తేలిస్తే బాగుంటుందంటూ జేఏసీ నేతలపై ఒత్తిడి వచ్చింది. దీంతో జేఏసీలోని కార్మిక సంఘాలు విడివిడిగా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. డిపోలవారీగా కమిటీ ప్రతినిధులను ఆహ్వానించి అభిప్రాయ సేకరణ జరిపాయి. టీఎంయూ, ఈయూ, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కార్మికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.


సమ్మె విషయంపై చర్చిస్తున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

కొందరు అలా.. మరికొందరు ఇలా
46 రోజులపాటు ఉధృతంగా సమ్మె కొనసాగించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం, ఇప్పటికే రెండు నెలలపాటు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని పెద్ద సంఖ్యలో కార్మికులు అభిప్రాయపడ్డారు. అయితే ఇన్ని రోజులు సమ్మె చేసి ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని, తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. సమ్మెను కొనసాగిస్తే ఉద్యోగ భద్రత కరువైందన్న ఆందోళనతో మరికొందరు మరణించే ప్రమాదం ఉన్నందున ఈ విషయాన్ని కూడా పరిగణించాలని కొందరు సూచించారు. సూపర్‌వైజర్ల సంఘం భేటీలో మాత్రం ఎక్కువ మంది సమ్మెను విరమించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా భిన్న వాదనలు వినిపించడంతో కార్మిక సంఘాలు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాయి.

అనంతరం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జేఏసీ భేటీ అయింది. అప్పటివరకు సంఘాలుగా కార్మికుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై ఇందులో చర్చించారు. జేఏసీలో కూడా మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్నందున కార్మికులు కూడా సమ్మెను కొనసాగించాలంటూ ఓ సంఘానికి చెందిన నేతలు పేర్కొన్నారు. సమ్మె విరమించాక ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సమ్మె విరమించి వస్తే విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టత కోరి దానిపై నిర్ణయం తీసుకుంటే మంచిదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం మధ్యవర్తిత్వం నెరపడం సరికాదని మరొకరు పేర్కొన్నారు. వెరసి మరికొంత సమ యం తీసుకొని తుది నిర్ణయానికి రావాలని తీర్మానించారు. ఇందుకు న్యాయవాదులతో కూడా చర్చించాలని నిర్ణయించారు. కోర్టు పేర్కొన్న విషయాలపైనా కూలంకషంగా చర్చించాలని, ఇం దుకు న్యాయవాదులతో మాట్లాడాలని నిర్ణయించి తుది నిర్ణయాన్ని బుధవారానికి వాయిదా వేశారు.

జేఏసీ నిర్ణయానికి కార్మికులు కట్టుబడతామన్నారు: అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ జేఏసీ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిపోలకు సంబంధించిన కమిటీల ప్రతినిధులు తేల్చిచెప్పారని సమావేశానంతరం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇప్పటివరకు మరణించిన కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకుంటామన్నారు. మరోవైపు బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన జేఏసీ–1, ఎన్‌ఎంయూ నేతలు తుది నిర్ణయం వెల్లడించనున్నారు. ఆ సంఘాలకు సంబంధించిన కార్మికుల్లో ఎక్కువ మంది సమ్మె కొనసాగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
     

మరిన్ని వార్తలు