ప్రభుత్వాస్పత్రుల భద్రతకు టీఎస్ఎస్పీ పోలీసులు
164 పోస్టుల మంజూరుకు ప్రభుత్వం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బందిపై దాడులను నిరోధించేందుకు ప్రత్యేక పోలీసు పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ బోధన ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యారోగ్య జిల్లాయూనిట్లలో రక్షణ నిమిత్తం తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీఎస్ఎస్పీ) దళాలను మోహరించాలని తెలంగాణ హోంశాఖ గతంలో నిర్ణయించింది. ఈ మేరకు 164 ప్రత్యేక పోస్టులు కావాలని అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ఈ పోస్టులకు ఆర్థికశాఖ సోమవారం అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో ఒక ఇన్స్పెక్టర్, మూడు సబ్–ఇన్స్పెక్టర్, ఎనిమిది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, 20 హెడ్ కానిస్టేబుల్, 132 పోలీసు కానిస్టేబుల్ మొత్తం 164 పోస్టులకు అనుమతులు జారీ అయ్యాయి. ఇందులో బోధనాస్పత్రులకు 128 పోస్టులు, నిజామాబాద్, మహబూబ్నగర్ ఆసుపత్రులకు 36 పోస్టుల చొప్పున మంజూరయ్యాయి.