వచ్చే నెలలో టీఎస్ఎస్పీడీసీఎల్ నియామక ప్రకటన
2వేల జేఎల్ఎం, 500 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
మరో 25 జూనియర్
పర్సనల్ ఆఫీసర్ పోస్టులు
అక్టోబర్లో రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : భారీ ఉద్యోగ నియామక జారీ ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సిద్ధమవుతోంది. 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 2,000 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆగస్టు 3 లేదా 23న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. 3న నోటిఫికేషన్ ఇస్తే.. జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఆగస్టు 6 నుంచి, జేపీఓలకు 14 నుంచి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 23న నోటిఫికేషన్ ఇస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 13 ఉదయం జేపీఓ, మధ్యాహ్నం జేఎల్ఎం, అక్టోబర్ 20న ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 95ః5 స్థానిక, స్థానికేతర కోటాను అమలు చేయనున్నారు.