జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతాం

30 Mar, 2019 12:51 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  బహిరంగ సభకు హాజరైన ప్రజలు    

గోదావరి జలాలతో సత్తుపల్లిని సస్యశ్యామలం చేస్తాం 

టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి నామా, మాజీ మంత్రి తుమ్మల 

సాక్షి, వేంసూరు: కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంచుతామని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మువ్వా విజయ్‌బాబు, డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం వేంసూరులో ప్రచారం నిర్వహించారు. వేంసూరు నుంచి మర్లపాడు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మర్లపాడులో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామాను గెలిపించాలని కోరారు. అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్‌లో పోరాడానని, తనను ఆశీర్వదించి గెలిపించి ఖమ్మం పార్లమెంట్‌ గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్త నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మర్లపాడు సర్పంచ్‌ మందపాటి వేణుగోపాల్‌రెడ్డి, వెల్ది జగన్‌మోహన్‌రావు, అట్లూరి సత్యనారాయణరెడ్డి, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, బండి శ్రీనివాసరెడ్డి, నాగళ్ల లక్ష్మీనారాయణ, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రావు, గాయం రాంబాబు, దొడ్డ చెన్నకేశవరెడ్డి, సర్పంచ్‌లు ఎండీ ఫైజుద్దీన్, పొట్రు అనంతరామయ్య పాల్గొన్నారు. 


నామాను గెలిపించాలి  
సత్తుపల్లి: అందరూ కలిసికట్టుగా నామా నాగేశ్వరరావును గెలిపించి సీఎం కేసీఆర్‌కు ఖమ్మం ఎంపీ సీటును కానుకగా ఇద్దామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గంగారం నుంచి సత్తుపల్లి రింగ్‌ సెంటర్‌ వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు.

అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందాయని.. అభివృద్ధి శరవేగంగా జరిగిందని.. రూ.18వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జిల్లాకు అదృష్టమని పేర్కొన్నారు. రైతు బిడ్డగా తనను పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు