తుంగభద్రకు పెరుగుతున్న ఉధృతి 

17 Jun, 2018 02:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఉప నదులు, వాగుల నుంచి ప్రవాహాలు వస్తుండటంతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ప్రాజెక్టులోకి 48 వేల క్యూసెక్కుల నీరు రాగా, శనివారం అది మరో 4 వేలకు పెరిగింది. శనివారం 52,136 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదైంది. శుక్రవారం ప్రాజెక్టులో నీటి నిల్వ 11.91 టీఎంసీలు ఉండగా శనివారానికి 16.38 టీఎంసీలకు చేరింది. ఒక్క రోజులోనే సుమారు 5 టీఎంసీల నీరు ప్రాజెక్టుకు చేరింది. వాటర్‌ ఇయర్‌ మొదలయ్యాక తొలిసారి ఆల్మట్టిలోకి శనివారం నుంచి ప్రవాహాలు మొదలయ్యాయి. ఆల్మట్టిలోకి 2,153 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ 22.61 టీఎంసీలకు చేరింది. ఇక నారాయణపూర్‌లోకి ప్రవాహాలు తగ్గాయి. మూడ్రోజులుగా ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా శనివారం అది 900 క్యూసెక్కులకు తగ్గింది. జూరాల, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులకు సైతం నీటి ప్రవాహాలు తగ్గాయి.

మరిన్ని వార్తలు