తూప్రాన్‌లో రూ.92 లక్షల మార్పిడి?

15 Dec, 2016 03:26 IST|Sakshi

- మార్పిడి పేరుతో మోసం జరిగినట్లుగా ప్రచారం
- ఇరు వర్గాల మధ్య దాడులు.. సీన్‌లోకి పోలీసు అధికారి


తూప్రాన్‌: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రూ.92 లక్షల నోట్ల మార్పిడిలో ఓ పోలీసు అధికారి తన చేతి వాటం చూపించినట్లుగా ప్రచారం సాగుతోంది. కొత్త నోట్లు తెచ్చిన వ్యక్తిని బెదిరించి సదరు పోలీసు అధికారి అతని సన్నిహిత వ్యాపారి కలసి రూ.92 లక్షలు నొక్కేసినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఈ ఉదంతం తూప్రాన్, మనోహరాబాద్‌ మండలా ల్లో కలకలం సృష్టిస్తోంది. మెదక్‌ జిల్లా మనోహరా బాద్‌ మండలం కాళ్లకల్‌కు చెందిన ఓ వ్యాపారి తనకున్న పరిచయంతో హైదరాబాద్‌కు చెందిన కోడిగుడ్ల వ్యాపారితో పెద్ద నోట్ల మార్పిడి విషయం లో చర్చించినట్లు తెలిసింది. ఇందుకోసం 20 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ కోసం ఇరువురి మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం.

కాళ్లకల్‌కు చెందిన సదరు వ్యాపారి తమ వద్ద ప్రభుత్వం రద్దు చేసిన రూ.1000, రూ.500 నోట్లు రూ.కోటి ఉన్నా యని నమ్మబలికాడు. దీంతో హైదరాబాద్‌కు చెంది న వ్యాపారి తన స్నేహితులతో చర్చించి వారి వద్ద ఉన్న రూ.92 లక్షలను గత రెండు రోజుల క్రితం సోమవారం రాత్రి కాళ్లకల్‌కు తీసుకువచ్చారు. కాగా, గ్రామ సమీపంలోని టీఎంటైర్‌ పరిశ్రమకు ఎదురు గా ఉన్న గ్రీన్‌పార్కులోకి తీసుకుని వెళ్లారు. పెద్ద మొత్తాన్ని కాళ్లకల్‌ వ్యాపారి చూసి పెద్ద నోట్లను తీసుకురమ్మని తన స్నేహితులకు చెబుతానని నమ్మ బలికి నలుగురు వ్యక్తులను వారు ఉన్న ప్రదేశానికి రప్పించాడు. ఇదే అదనుగా భావించి ఆ నలుగురు హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నం చేశారు. దీంతో కాళ్లకల్‌కు చెందిన వ్యాపారి తనతో సన్నిహితంగా ఉన్న ఓ పోలీస్‌ అధికారికి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సదరు పోలీసు అధికారి వారిని అక్కడి నుంచి చెదర గొట్టాడు.

అక్కడ లభించిన రూ.27 లక్షలు వంద రూపాయల నోట్ల కట్టలను తన వెంట తీసుకెళ్లి నట్లుగా తెలిసింది. రూ.65 లక్షలు విలువ చేసే 2వేల రూపాయల నోట్ల కట్టలను కాళ్లకల్‌ వ్యాపారి కాజేసి నట్లుగా వీరికి ఓ స్థానిక మహిళ సహకరించినట్లుగా తూప్రాన్‌లో ప్రచారం సాగుతోంది. సోమవారం రాత్రి గాయపడిన బాధితులు హైదరాబాద్‌లో కొందరు నాయకులతో మెదక్‌ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ‘సాక్షి’ స్థానిక డీఎస్పీని వివరణ కోరగా  విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు. కాళ్లకల్‌కు చెందిన వెంకట్, రాజు, మరో ఇద్దరిపై కేసు పెట్టా మన్నారు. మనోహరాబాద్‌ ఎస్‌ఐపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇందుకోసం తూప్రాన్, శివ్వం పేట ఎస్సైలు విచారణ చేపట్టినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు