జూబ్లీహిల్స్: మహిళలను ఎక్కడ పూజిస్తారో.. గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, శక్తిస్వరూపిణులైన అతివలు వారిలోని నైపుణ్యాలను, అభిరుచులను ప్రదర్శించడం అభినందనీయమని ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను అన్నారు. యూసుఫ్గూడ సవేరా ఫంక్షన్హాల్లో బుధవారం నారీలోకం పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వృత్తి, ఉపాధి, కుటుంబ బాధ్యతల్లో మునిగితేలే మహిళలకు ఒక ఆటవిడుపులా కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు.
ఈ సందర్భంగా మహిళలంతా ఆటపాటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనల్లో మునిగితేలారు. ర్యాంప్వాక్తో అదరగొట్టారు. విజేతలకు బహుమతులు అందించారు. రెడ్రోజ్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బుల్లితెర నటీమణులు రోహిణి, రాగిణి, ఇంటూరి వాసు, రిషిక, రాంజగన్, భాను సహా పలువురు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకుడు రాజేష్, జెమినీ టీవీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.