జడ్చర్ల్లలో సహకార సంఘం అధికారుల నిర్వాకం
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కావేరమ్మపేటలో జంగయ్య అనే రైతు బాకీ చెల్లించలేదని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధికారులు మంగళవారం ఆయన ఇంట్లో నుంచి టీవీని ఎత్తుకెళ్లారు. 1994లో జంగయ్య తండ్రి చిన్న లక్ష్మయ్య బాదేపల్లి సహకార సంఘంలో రూ.36 వేలు అప్పు తీసుకున్నాడు. తండ్రి చేసిన అప్పులో సుమారు రూ. 35 వేలను జంగయ్య చెల్లించాడు.
అనంతరం అప్ప ట్లో వైఎస్ ప్రభుత్వం రైతురుణాలు మాఫీ చేయడంతో తన అప్పు కూడా మాఫీ అయిందని భావించాడు. అయితే, తనకు 5 ఎకరాలకుపైగా భూమి ఉండడంతో బకాయి మాఫీ కాలేదంటూ సహకార సంఘం అధికారులు అప్పును రూ. లక్షకు పైగా చేశారు. కొంత గడువు కావాలని అడిగినా వినకుండా ఇంట్లో ఉన్న టీవీ ఎత్తుకెళ్లారు. అప్పు చెల్లించాలని నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడంతో చట్ట ప్రకారం గా చర్యలు తీసుకుంటున్నామని బాదేపల్లి శాఖ సూపర్వైజర్ యాదగిరి చెప్పారు.