యువకుడి దారుణ హత్య..

6 Jul, 2019 13:19 IST|Sakshi

సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు మరో యువకుడిని హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బ్రాహ్మణ బజార్‌కు చెందిన ఎండీ.షకీల్‌(20)కు, తెలంగాణ నగర్‌కు చెందిన అనుముల శివశంకర్‌రెడ్డి అనే మరో యువకుడికి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. కాగా..గురువారం రాత్రి శివశంకర్‌రెడ్డి స్నేహితుడి బర్త్‌ డే వేడుకకు వెళ్లి వస్తుండగా షకీల్‌ తారస పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం వారు తెలంగాణనగర్‌కు వెళ్లారు. అక్కడ కూడా మరోసారి ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో శివశంకర్‌రెడ్డి తనకు వరుసకు సోదరుడైన మహేందర్‌రెడ్డితో కలిసి షకీల్‌పై దాడి చేశాడు. మెడపై కత్తితో పొడవడంతో షకీల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులిద్దరూ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. మృతుడి తండ్రి గౌస్‌పాషా ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని సీఐ మడత రమేష్, ఎస్‌ఐ ముత్యం రమేష్‌ పరిశీలించి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారం వల్లే ఈ హత్య చోటుచేసుకుందని పట్టణంలో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు