వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..! ట్విస్ట్‌ ఏంటంటే?

3 Dec, 2019 15:40 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు..! అయితే అన్ని ప్రేమకథల్లాగే ఈ స్టోరీలో కూడా వారి పెళ్లికి ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఇంతవరకూ స్టోరీ రొటినే. అయితే ఈ కథలో ట్విస్ట్‌ ఏంటంటే..వాళ్లిద్దరూ అబ్బాయిలు. ఔను..ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమ..పెళ్లికి దారి తీసింది. అయితే లింగ మార్పిడి చేయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు షరతు పెట్టాడు. దీంతో రెండో యువకుడు.. లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. అయితే లాస్ట్‌మినిట్‌లో మొదటి యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది.

సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. కొలువు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేటకు చెందిన గుండ్లగాని సాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పేరుతో దగ్గరైన వీరిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మహిళగా మారితేనే పెళ్లి చేసుకుంటానని సాయి చెప్పడంతో.. జానయ్య లింగమార్పిడి చేయించుకున్నాడు. తీరా మహిళగా మారిన తర్వాత సాయి పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ పంచాయితీని ఎలా విప్పాలో తెలియక పోలీసులు తలల పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు