పాసా.. ఫెయిలా?

23 Apr, 2019 02:02 IST|Sakshi

ఇంటర్‌ బోర్డు లీలలు.. 2 మెమోల్లో వేర్వేరు ఫలితాలు 

సిద్దిపేటఎడ్యుకేషన్‌: ఇంటర్‌ ఫలితాలు వెలువడగానే ఓ విద్యార్థిని ఆత్రుతగా సంబంధిత వెబ్‌సైట్‌లో తన ఫలితాలు చూసుకుంది. ఫెయిల్‌ మెమో రావడంతో ఏడుస్తూ ఇంటిదారి పట్టింది. ‘పరీక్షలు అన్నీ బాగానే రాశాను మంచి మార్కులు వస్తాయనుకుంటే ఇలా జరిగిందేమిటి’అంటూ రోదిస్తూ కూర్చుంది. కొంతసేపటి తర్వాత ఆ విద్యార్థిని సోదరుడు ఫోన్‌ చేసి ‘కంగ్రాట్స్‌.. నీవు మంచి మార్కులతో పాస్‌ అయ్యావు’ అంటూ అభినందించాడు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ముస్తాబాద్‌కు చెందిన శ్రీనిధి సిద్దిపేటలోని గురుకృప కళాశాలలో ఎంపీసీ ఫస్టియర్‌ చదివి పరీక్షలు రాసింది. ఇంతకూ నేను పాసయ్యానా? ఫెయి లయ్యానా? అం టూ 2 మెమోలు పట్టుకుని తల్లిదండ్రులతో కలసి కళాశాలలో సంప్రదించింది.

ఈ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం తప్ప తామేమి చేయలేమని యాజమాన్యం స్పష్టం చేసింది. శ్రీనిధి ఫస్టియర్‌లో ద్వితీయ భాషగా సంస్కృతం ఎంపిక చేసుకుంది. అయితే ఒక మెమోలో సంస్కృతం రాగా, మరో మెమోలో తెలుగు అని వచ్చింది. అలాగే, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీలో ఓ విద్యార్థి ఒకేషనల్‌ కోర్సులో అన్ని ప్రాక్టికల్‌ పరీక్షలకు గైర్హాజరైనట్లు వచ్చింది. ఇంటర్‌బోర్డు నిర్వాకంతో పిల్లల జీవితాలు తారుమారవుతున్నాయని తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు.  
 

>
మరిన్ని వార్తలు