సాక్షి, కరీంనగర్ : జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదివరకే వైరస్ సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు తాజాగా కరోనా పాజిటివ్గా తేలిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. కరోనా సోకినవారిలో ఇద్దరు మహిళలేనని చెప్పారు. ఆ ఇద్దరితోపాటు, వారి ముగ్గురు పిల్లలను సైతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించామన్నారు. మొత్తం 8 మంది కుటుంబసభ్యులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. రెడ్ జోన్ పరిధిలో గృహనిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మొత్తం 622 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన శాతవాహన యూనివర్సిటీ క్వారంటైన్లో 35 మంది, చల్మెడ ఆస్పత్రిలో 49 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. మరో ఇద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. జిల్లాలో 14,995 మంది వలస కూలీలు ఉన్నారని.. వారికి ఒక్కొక్కరికి రూ. 500, 12 కిలోల బియ్యం రేపు(మంగళవారం) సాయంత్రంలోగా పంపిణీ చేస్తామని అన్నారు.