తెలంగాణలో 47కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

27 Mar, 2020 13:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులను వైద్యులు నిర్థారించారు. దీంతో తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 47కి చేరింది.  ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 47 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని  ఈటల తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వెలుగుచూసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. (వాట్సప్‌ను తెగ వాడేస్తున్నారు)

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 22 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న పరికరాలుతో పాటు వైద్య సిబ్బంది సహకారం కూడా అందిస్తామని ముందుకు వచ్చినట్లు ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రభుత్వం హాస్పిటల్, రెండో విడతలో ప్రైవేట్ కాలేజీలను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలాగే 10వేల పడకలు, 700  ఐసీయూ, 170 వెంటిలెటర్స్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. (చైనాను అధిగమించిన అమెరికా)

ఇక దేశం వ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి 724 కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య 16కి చేరింది. కేరళలో వైరస్‌ ఉధృతి వేగంగా ఉంది. 137 కేసులతో కేరళ తొలి స్థానంలో ఉండగా.. మహారాష్ట్రంలోనూ (130) తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ బాధితుల సంఖ్య 39కి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. పలు చోట్ల మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. బయటకు రావద్దని పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. యదేచ్చగా బయట తిరుగుతున్నారు.

మరిన్ని వార్తలు