ఐఏఎస్సా.. ఐపీఎస్సా?

24 Aug, 2018 01:50 IST|Sakshi
రాహుల్‌ బొజ్జా , కృష్ణప్రసాద్‌

ఆర్టీసీ ఎండీ పదవికి పరిశీలనలో ఇద్దరి పేర్లు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి త్వరలోనే కొత్త ఎండీ రానున్నారు. ఓ యువ ఐఏఎస్‌ అధికారిని పూర్తిస్థాయి ఎండీగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఆర్టీసీ ఎండీ రమణారావు పదవీకాలం మేలో పూర్తయింది. తరువాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కానీ, ఆ బాధ్యతలను ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మకు అప్పగించారు. రోడ్లు–భవనాలు, రవాణాశాఖకు ఆయన కమిషనర్‌గా వ్యహరిస్తూనే.. ఆర్టీసీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.

ఆర్టీసీ బాధ్యతలనుంచి తనను తప్పించాల్సిందిగా శర్మ ప్రభుత్వాన్ని కొంతకాలంగా విన్నవిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో యువ ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జా పేరును, మరో డీజీపీ ర్యాంకు స్థాయి ఐపీఎస్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ పేర్లు తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్‌ బొజ్జా పరిపాలన దక్షత కలిగిన అధికారిగా మంచిపేరు సంపాదించారు. ప్రస్తుతం రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్‌కు రోడ్డు రవాణారంగంపై మంచి పట్టు ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎవరినీ ఖరారు చేయలేదు. వీరిద్దరిలో ఒకరి పేరు ఖరారు చేస్తూ త్వరలోనే ఆదేశాలు రావొచ్చని ఆర్టీసీలో చర్చ నడుస్తోంది.

మరిన్ని వార్తలు