ముగ్గురిలో ఇద్దరు మైనర్లు

29 Feb, 2016 02:40 IST|Sakshi
ముగ్గురిలో ఇద్దరు మైనర్లు

♦ వారందరిపై నిర్భయ కేసు పెట్టాం: డీఎస్పీ
♦ ఆ యువతి పోలీసు ఉచిత శిక్షణకు ఎంపిక కాలేదు
♦ స్నేహితురాలితో అప్పుడప్పుడు మాత్రమే వస్తుండేది
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్/వీణవంక: దళిత యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ కీచకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకుల్లో ఇద్దరు మైనర్లని ప్రకటించారు. వీరిద్దరిని జువైనల్ హోంకు తరలించిన పోలీసులు ప్రధాన నిందితుడైన శ్రీనివాస్‌ను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఆదివారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్‌రెడ్డి మీడియా సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 ఆ మెసేజ్ ఆమె బంధువు చూడడంతో చెప్పింది
 చల్లూరు గ్రామానికి చెందిన యువతి వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉచిత శిక్షణ శిబిరానికి ఎంపికైన అభ్యర్థిని కాదు. తన స్నేహితురాలితో అప్పుడప్పుడు మాత్రమే హజరయ్యేది. గతంలోనే యువతికి ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్‌తో పరిచయం ఉంది. ఈ నెల 10న కోచింగ్ సెంటర్ నుంచి శ్రీనివాస్ యువతిని తీసుకుని శంకరపట్నం మండలంలోని కాచాపూర్ గుట్ట సమీపంలోని ఓ పాడుబడిన షెడ్డులోకి తీసుకెళ్లి తన స్నేహితులైన ముద్దం రాకేష్, ముద్దం అంజయ్యలతో కలసి యువతిపై అత్యాచారం చేశారు. ఈ అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

ఈ క్రమంలో సదరు యువతి ఈ సంఘటన జరిగిన రోజు బంధువుల ఇంటికి వెళ్లింది. జరిగిన  ఘటనను అప్పటికి ఎవరికీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితుల్లో ఒకరు యువతి సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేశారు. ‘‘మా కోరిక తీర్చాలి. లేకుంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడుతాం’’అని అందులో బెదిరించాడు. ఈ మెసేజ్‌ను యువతి బంధువు చూసి అడగ్గా అప్పుడు ఆమె.. జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో బంధువులంతా ఈ నెల 24న రాత్రి యువతితో ఆ యువకుల సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయించి చల్లూరు రావాలని పిలిపించారు. తొలుత శ్రీనివాస్, అంజయ్య రాగా...వారిని చితకబాదారు. వారి ద్వారా మరో నిందితుడైన రాకేశ్‌కు ఫోన్ చేసి రప్పించి అతనిపై దాడి చేశారు. అనంతరం వీణవంక ఎస్సై కిరణ్‌కు ఫోన్ చేశారు. వెంటనే కిరణ్ చల్లూరు వెళ్లి బంధువుల చేతిలో గాయపడిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై 376-డి నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చికిత్స కోసం వరంగల్ తరలించారు. కాగా, కేసులో ఏ 2గా ఉన్న అంజయ్య, ఏ3గా ఉన్న రాకేశ్‌లు మైనర్లు కావడంతో కరీంనగర్‌లోని జువైనల్ హోంకు తరలించారు.

మరిన్ని వార్తలు