కొండపోచమ్మ సాగర్‌ పనుల్లో అపశృతి

15 Jun, 2019 01:50 IST|Sakshi

మిల్లర్‌ కిందపడి ఇద్దరు కార్మికులు మృతి

గజ్వేల్‌రూరల్‌ : కొండపోచమ్మ సాగర్‌ కాల్వ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. కాల్వ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కార్మికులపై కాంక్రీటు–సిమెంట్‌ మిక్చర్‌ మిల్లర్‌ లారీ జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న కొండపోచమ్మ సాగర్‌ ప్రధాన కాల్వ నిర్మాణ పనుల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం కాల్వలో సిమెంటు–కాంక్రీటు వేసేందుకు తీసుకొచ్చిన మిక్చర్‌ మిల్లర్‌ లారీ కాల్వపై భాగం నుంచి అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో కింది భాగంలో ఉన్న కార్మికులు దానికింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసేందుకు రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా గ్రామస్తులు, పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.  మృతులను మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పనపల్లి గ్రామానికి చెందిన సంజీవ్‌ (45), మహేశ్‌ (23)గా గుర్తించారు. 

మరిన్ని వార్తలు