ఎలా జరిగిందో తెలియదు.. కానీ చెల్లా చెదురయ్యాం

3 Dec, 2019 07:48 IST|Sakshi
లారీని ఢీకొన్న ఆటో

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

మరో 11మందికి తీవ్రగాయాలు

లారీని ఢీకొట్టిన ఆటో

తిమ్మాజీపేట సమీపంలో చోటుచేసుకున్న ఘటన

క్షతగాత్రులంతా తువ్వబండతండాకు చెందిన వారే..

జడ్చర్ల: పెళ్లి వేడకకు హాజరై తిరిగి ఆటోలో వస్తుండగా.. ముందున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా, మరో 11మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు..తిమ్మాజీపేట మండలం బాజీపూర్‌ గ్రామ సమీపంలోని తువ్వబండతండ, తుమ్మలకుంట తండాలకు చెందిన వారు ఆదివారం తిమ్మాజీపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తంతు ముగించుకుని సోమవారం ఆటోలో జడ్చర్లకు బయలుదేరారు. ఆటోలో దాదాపు 15మంది దాక ఉన్నట్లు తెలుస్తుంది. తండాకు చెందిన వారంతా హైద్రాబాద్‌లో ఉపాధి నిమిత్తం నివాసం ఉంటుండడంతో హైద్రాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమను ఆటోలో జడ్చర్లలో విడిచి రావాలని ఆటో డ్రైవర్‌ సురేష్‌ను కోరడంతో వారిని ఎక్కించుకుని జడ్చర్లకు బయలు దేరారు. 10 నిమిషాల తరువాత తిమ్మాజీపేట పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుకగా ఆటో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. 

చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లలిత(18), లక్ష్మణ్‌ (28) అనంతరం మృతిచెందారు. లలిత మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా.. లక్ష్మణ్‌ హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అంతకుముందు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సురేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న తావుర్యా, బుజ్జి, లక్ష్మి, అనిత, బుజ్జాలి, వైష్ణవి, చరణ్,చింటూ, జాంప, ఆకాష్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108అంబులెన్స్‌లో బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక వైద్య చికిత్సలు నిర్వహించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న అనిత, వైష్ణవి, తావుర్యా, సురేష్‌ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.  క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పేర్కొంటున్నారు. అంతా తువ్వబండతండాకు చెందిన వారేనని, ఆటో డ్రైవర్‌ సురేష్‌ మాత్రం తుమ్మలకుంట తండాకు చెందిన వాడని బంధువులు తెలిపారు.

చెల్లాచెదురయ్యాం
ఆటో ఒక్కసారిగా లారీని ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని, తామంతా చెల్లాచెదరై రోడ్డుపై పడిపోయామని క్షతగాత్రులు ఈసందర్భంగా తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో, అసలేం జరిగిందో తెలియదని, తామంతా తీవ్ర గాయాలకు గురయ్యామని వారు కన్నీరు మున్నీరయ్యారు. లలిత మృతిచెందడంతో తల్లిదండ్రులు జంబ్రు, పాత్లావత్‌ తార్యా కన్నీరు మున్నీరయ్యారు, 

మరిన్ని వార్తలు