ఆధార్‌ నోటీసుల వ్యవహారం: కీలక అంశాలు!

20 Feb, 2020 11:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌ నోటీసుల వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్‌) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నకిలీ ధృవపత్రాలతో ఆధార్‌ కార్డు అందుకున్నాడంటూ హైదరబాద్‌లో నివసించే సత్తర్‌ఖాన్‌ అనే ఆటో రిక్షా ​డ్రైవర్‌కు ఫిబ్రవరి 3న నోటీసులు జారీచేసింది. కాగా 2018లో రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాలు సృష్టించి.. వారికి ఆధార్‌కార్డులు ఇప్పించినట్లు సత్తార్‌పై సీపీఎస్‌లో కేసు నమోదైనట్లు సమాచారం. అదే విధంగా.. పాతబస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పాత్రలు సృష్టించి 127 మంది రోహింగ్యా లకు ఆధార్ నమోదు చేయిస్తున్న విషయం బట్టబయలైంది.

ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా... తెలంగాణ పోలీసులు ఆధార్‌ సంస్థకు లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ఆధార్‌ యాజమాన్యం 127 మంది రోహింగ్యా ముస్లింలకు నోటీసులు జారీచేసింది. సరైన పత్రాలతో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అతడికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. ఇక సత్తార్‌ఖాన్‌కు తనకు వచ్చిన నోటీసుల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. ఆధార్‌ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారు గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా... ఈరోజు జరగాల్సిన నకిలీ ఆధార్ విచారణను యూడీఏఐ రద్దు చేసింది. బాలాపూర్ మెగా గార్డెన్స్‌లో విచారణ జరగాల్సి ఉండగా అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక తదుపరి విచారణకు సంబంధించిన వివరాలను నోటీసులు అందుకున్న వారికి స్పీడ్‌పోస్టులో పంపింది.

పౌరసత్వాన్ని నిరూపించుకోండంటూ 127 మందికి నోటీసులు

మరిన్ని వార్తలు