చంపేసి.. కాల్చేసి..

25 May, 2015 23:34 IST|Sakshi
చంపేసి.. కాల్చేసి..

గుర్తుతెలియని మహిళ దారుణ హత్య
ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం  
క్లూస్‌టీం, జాగిలాలతో వివరాల సేకరించిన పోలీసులు

పరిగి:గుర్తు తెలియని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళను చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు. పోలీసులు క్లూస్‌టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపూర్-మిట్టకోడూర్ మార్గంలోని అటవీప్రాంతంలో ఓ మృతదేహం పూర్తి గా కాలిపోయి ఉంది.

ఈ విషయమాన్ని గమనించిన మిట్టకోడూర్‌కు చెందిన పశువుల కాపర్లు గ్రామస్తులకు తెలిపారు. ఘటన ఇబ్రహీంపూర్ రెవెన్యూ పరిధిలో జరగడంతో ఆ గ్రామ సర్పంచ్ అనంతయ్య ఫిర్యాదు మేరకు పరిగి సీఐ ప్రసాద్, ఎస్‌ఐ శంషొద్దీన్ సిబ్బం దితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. గుర్తుపట్టే వీలులేకుండా పోయింది. చేతులకు ఉన్న గాజుల ఆధారంగా హత్యకు గురైంది మహిళ అని పోలీసులు గుర్తించారు. ముఖానికి స్కార్ఫ్ చుట్టి ఉంది. మహిళ 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహానికి బెండింగ్ వైర్లు చుట్టి ఉన్నాయి. దగ్గరలో ఓ అగ్గిపెట్టె పడి ఉంది. మహిళ కాళ్లకు మెట్టెలు లేకపోవడంతో పెళ్లి కాని యువతి కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.  ఘటనా స్థలానికి సమీపంలో కారు తిరిగిన ఆనవాళ్లు కనిపించాయి.

దీనిని బట్టి దుండగులు యవతిని వేరే ప్రాంతంలో హత్య చేసి శనివారం రాత్రి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేసి..కాల్చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు క్లూస్‌టీం సాయంతో ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్న మట్టిరోడ్డు వరకు వెళ్లి ఆగింది. మృతదేహం పూర్తిగా కాలిపోవటంతో డాక్టర్ అపూర్వ ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. యువతి హత్య విషయమై సమీపంలోని మహబూబ్‌నగర్ పోలీసులతో పాటు అన్ని ఠాణాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు