హెచ్‌సీయూ విద్యార్థినికి రికార్డు ప్యాకేజీ

13 Feb, 2020 12:27 IST|Sakshi
వి. నందిని సోని

సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థినికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భారీ ప్యాకేజీతో ఆఫర్‌ వచ్చింది. స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌లోని ఎంసీఏ విద్యార్థిని వి. నందిని సోని క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో అడోబ్‌ సిస్టమ్స్‌ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. హెచ్‌సీయూలోని ప్లేస్‌మెంట్‌ గైడెన్స్‌ అండ్‌ అడ్వైజరీ బ్యూరో సమన్వయంతో ఈ ప్లేస్‌మెంట్‌ను నిర్వహించారు. రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి నందినిని అడోబ్‌ సిస్టమ్స్‌ కంపెనీ ఎంపిక చేసింది. దీంతో హెచ్‌సీయూలో చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక ప్యాకేజీ అందుకున్న విద్యార్థినిగా నందిని సోనీ నిలిచారు. నందిని తన పాఠశాలను విద్యను మహారాష్ట్రలోని బోయిసర్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో పూర్తి చేశారు. అహ్మదాబాద్‌లోని సెయింట్‌ జేవీయర్స్‌ కళాశాలలో బీసీఏ చదివారు. కాగా, ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో 200 మందిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని హెచ్‌సీయూ ప్లేస్‌మెంట్‌ గైడెన్స్‌ అండ్‌ అడ్వైజరీ బ్యూరో చైర్మన్‌ రాజీవ్‌ వాంకర్‌ తెలిపారు.

ఇంజినీరింగ్‌ వదిలేశా: నందిని
మొదట ఇంజినీరింగ్‌ కోర్సులు చేయాలనుకున్నా కానీ ఆ తరువాత కంప్యూటర్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. నైపుణ్యం కలిగిన సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా ఉండాలన్న లక్ష్యంతో ఎంసీఏలో చేరినట్టు నందిని సోని తెలిపారు. స్మార్ట్‌ ఇండియా హాకథాన్‌– 2019లో తన బృందంతో కలిసి విజేతగా నిలిచినట్టు వెల్లడించారు. అత్యధిక ప్యాకేజీతో అడోబ్‌ సిస్టమ్స్‌లో ఉద్యోగం రావడం సంతోషంగా ఉందన్నారు. (ఐసెట్‌–2020 నోటిఫికేషన్‌ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

మరిన్ని వార్తలు