ఎరువు.. కరువు.. రైతులకు లేని ఆదరువు

5 Sep, 2019 12:14 IST|Sakshi
యూరియా కోసం ఉప్పల్‌వాయిలో బారులు తీరిన రైతులు

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. సరిపడా ఎరువు అందక పోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యూరియా కోసం బుధవారం ఉదయం నుంచే సొసైటీల వద్ద రైతులు బారులు తీరారు. కామారెడ్డి, బీర్కూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ తదితర మండలాల్లోని సింగిల్‌ విండోల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. స్టాక్‌ రాకపోవడంతో పలుచోట్ల ఆందోళన చేశారు.

మాచారెడ్డి: యూరియా కోసం మాచారెడ్డిలో రైతన్న రోడ్డెక్కాడు. ఎన్నిసార్లు వచ్చినా స్టాక్‌ లేదంటూ సింగిల్‌విండో సిబ్బంది చేతులెత్తేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్‌విండో సిబ్బంది వ్యాపారులకు యూరియా దొంగచాటుగా అమ్ముకుని కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒక వైపు అధికారులు యూరియా కొరత లేదంటూ ప్రకటలు చేస్తుంటే, మరోవైపు సిబ్బంది దొంగచాటుగా యూరియాను అమ్ముకుంటూ రైతులకు ఎగనామం పెడుతన్నారని మండిపడ్డారు. దాదాపు గంట పాటు కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలు నిలిచి పోయాయి. 700 టన్నుల పై చిలుకు యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 560 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది.

మరిన్ని వార్తలు