మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి

16 Nov, 2016 04:20 IST|Sakshi
మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనతోపాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను సచివాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్యాలగూడలో అన్ని రకాల వసతులున్నాయనీ, నల్లగొండ జిల్లాలో బాగా అభివృద్ధి చెందిన పట్టణం మిర్యాలగూడేనని తెలిపారు.

విద్య, వైద్యం, నీటిపారుదల, విద్యుత్, రవాణా తదితర రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, ఆసియాలోనే వరి ఉత్పత్తి చేసే ప్రధాన ప్రాంతమన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల మండలంలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పుతామని ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మిర్యాలగూడను జిల్లాగా చేస్తే చుట్టుపక్కల ఉన్న హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, కోదాడ, దేవరకొండలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. అంతేగాక మిర్యాలగూడలో పరిపాలనా భవనాల నిర్మాణానికి 50 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు