విజయమే లక్ష్యంగా ముందుకుపోదాం 

1 Apr, 2019 14:33 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

సాక్షి, కోదాడ : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని నల్లగొండ  పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివా రం కోదాడ పట్టణంలోని గన్నా సర్వయ్య ఫంక్షన్‌హాలులో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలతో పాటు తెలంగాణలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకోబోతుందన్నారు. మోసపూర్తి మాటలు, వాగ్ధానాలు, గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఓటమితో ఆ పార్టీ పతనానికి పునాది పడినట్లేనని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు కాంగ్రెస్‌ వైపే ఉన్నారని అన్నారు. వారితో ఓటు వేయించుకోవడంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. రాహూల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని అందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్‌లో సోమవారం జరగనున్న రాహూల్‌గాంధీ సభకు పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.  ఈ సందర్భంగా కోదాడకు చెందిన న్యాయ వాది నాళం రాజన్న, మునగాల మండల నాయకుడు వేమూరి సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, టీపీసీసీ పరిశీలకుడు ఎం.అనిల్‌కుమార్, నాయకులు పారా సీతయ్య, వంగవీటి రామారావు, వీరేపల్లి సుబ్బారావు, బషీర్, బాగ్ధాద్, వంటిపులి వెంకటేష్, పాలకి అర్జున్, ధనమూర్తి, వాడపల్లి వెంకటేశ్వర్లు, సైదిబాబు, రంగారావు, వీరారెడ్డి, సంగిశెట్టి గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు