హైదరాబాద్: మద్దతుధర కోసం నిరసన చేస్తున్న రైతులను పోలీసులు కాల్చిచంపడం బీజేపీ, ప్రధాని మోదీ వైఖరికి నిదర్శనమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆయన బుధవారం గాంధీభవన్లో మాట్లాడుతూ.. నిన్న మధ్యప్రదేశ్లో రైతుల పై కాల్పులు దురదృష్టకరం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మోదీ ప్రభుత్వం వచ్చాక కార్పోరేట్లకు లక్షన్నర కోట్లు రుణమాఫీ ఇచ్చింది. అదే రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. దేశంలో 62 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 2,964 మంది ఆత్మహత్య చేసుకున్నారు.. అందులో మూడో వంతు వారిని కూడా ప్రభుత్వం అదుకోలేదని అన్నారు.