సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంతో పోరాడి సాధించుకుందామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్యాయత్నానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించి, అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఉత్తమ్ శనివారం ఓ ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దసరా పండుగ రోజు ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారని, వారి ఆకలి బాధలు కేసీఆర్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్కు కార్మికుల ఉసురు తగులుతుందని, ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కాంగ్రెస్పార్టీ వారికి అండగా ఉంటుందని ఆ ప్రకటనలో భరోసా ఇచ్చారు.