సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌  భేష్‌: ఆర్‌.సి.శ్రీవాత్సవ

21 Apr, 2019 04:50 IST|Sakshi


సాక్షి, హైదరాబాద్‌: ములుగు, జీడిమెట్లలో రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్వహిస్తున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఉత్తరాఖండ్‌ ఉద్యాన సంచాలకుడు ఆర్‌సీ శ్రీవాత్సవ శనివారం సందర్శించారు. ములుగులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో నూతన సాంకేతిక పద్ధతిలో పెంచుతున్న మామిడి తోటలు, నాణ్యమైన కూరగాయల నారును తయారు చేసే ప్లగ్‌ టైప్‌ నర్సరీలను ఆయన పరిశీలించారు. జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పాలీహౌజ్‌లో సాగు చేస్తున్న పంటలు, కూరగాయల నారును తయారు చేసే ప్లగ్‌ టైప్‌ నర్సరీలను సందర్శించారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో అనుసరిస్తున్న సాగు విధానాలను శ్రీవాత్సవ అభినందించారు. తెలంగాణలో రైతుల అభివృద్ధి కోసం ఉద్యాన శాఖ చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాలను ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరక్టర్‌ ఎల్‌.వెంకట్‌ రాంరెడ్డి వివరించారు. పంట కాలనీల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఉత్తరాఖండ్‌లో సాగులో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, నాణ్యమైన మొక్కల సరఫరా, పాలీహౌజ్‌ విధానంలో పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం తదితరాల అంశాలపై శ్రీవాత్సవ తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. 

మరిన్ని వార్తలు