-

‘అగ్ర’ కోటా మౌలిక సూత్రాలకు వ్యతిరేకం

29 Jan, 2019 05:25 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్‌ ఈశ్వరయ్య. చిత్రంలో జాజుల తదితరులు

10శాతం రిజర్వేషన్లను నిరసిస్తూ ఫిబ్రవరి 11న ఢిల్లీలో మహాధర్నా

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఓబీసీ ఫెడరేషన్‌

జాతీయ అధ్యక్షుడు జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య

హైదరాబాద్‌ : అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సామాజిక న్యాయానికి తీవ్ర వ్యతిరేక మని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఓ బీసీ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య అన్నారు. బిల్లుకు వ్య తిరేకంగా ఫిబ్రవరి 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు. బిల్లును వ్యతిరేకించిన ఆర్‌జేడీ, ఆప్, ముస్లింలీగ్, ఎంఐఎం పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలభార తీయ ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, బీసీ మహాజన సమితి సంయుక్త ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు.

సామా జికంగా వెనకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉంటే దాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్లు కల్పించడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల రాజ్యాంగం పరం గా అంటరాని తనం చూపినట్లే అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీకి మద్దతుగా గులాబీ , పచ్చ పార్టీలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై వీధిపోరాటం చేస్తూనే న్యాయపోరాటం చేస్తున్నామని దీనిలో భాగంగానే ఢిల్లీలో ధర్నా నిర్ణయం, తాను హైకోర్టులోనూ, జస్టిస్‌ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం, ఆఖరుకు 9.5 శాతం ఉన్న అగ్రవర్ణాలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 27 శాతం ఇవ్వడం దారుణమన్నారు.

56 శాతం ఉన్న బీసీలు ఉద్యోగాల్లో 8 శాతం మాత్రమే ఉన్నారని ఇంకా రిజర్వేషన్లలో కోత విధించడం సబబా అని ప్రశ్నించారు. గతంలో వర్సి టీ యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఇచ్చేవారని, కానీ అగ్రవర్ణాలకు చెందిన కొందరు కోర్టుకు వెళ్లగా డిపార్ట్‌మెంట్‌ యూనిట్‌గా కేటాయించాలని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనితో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించిందన్నారు. దీనివల్ల బీసీలకు నష్టంవాటిల్లుతోందని, వర్సిటీ ఉన్నత ఉద్యోగాల్లో ఇక బీసీలు ఉండరని తెలిపారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ, అసమానతల మధ్య సమాన పోటీ ఉండరాదని రిజర్వేషన్లు కేటాయించగా తిరిగి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వ డం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 85 శాతం ఉన్న బడుగులకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన 50 శాతం జనరల్‌ కోటా కింద 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు, అందరికీ కేటాయించారని ఇంకా వారికి రిజర్వేషన్లు ఎందుకన్నారు. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి పాలకులకు తగిన బుద్ధి చెపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పలువురు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు