వీసీ ప్రవీణ్‌రావుకు అవార్డు

13 Mar, 2020 03:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు.. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఈ అవార్డుని ఏర్పాటు చేశాయి. దేశంలో వ్యవసాయ రంగ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న శాస్త్రవేత్తలకు, వృత్తి నిపుణులకు రెండేళ్లకోసారి ఈ అవార్డుని అందజేస్తారు. ఐకార్‌ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ఎస్‌ పరోడా నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో నిష్ణాతులైన 13 మంది నుంచి వచ్చిన దరఖాస్తులను, రికార్డులను పరిశీలించి ఈ అవార్డుకి ఎంపిక చేసింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రవీణ్‌రావు బోధన, పరిశోధన, విస్తరణలలో తీసుకున్న అనేక విప్లవాత్మక చర్యల కారణంగా దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ యూనివర్సిటీ ఆరో స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు