ఎన్జీవోలు కూడా ప్రభుత్వంలో భాగమే: మంత్రి

2 Jun, 2020 14:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరేళ్ల కాలంలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓస్‌ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, ఎమ్మెల్యే వీజీ గౌడ్‌, కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు రక్తాదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. టీఎన్జీఓలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ​లేనని పేర్కొన్నారు.

అన్నివర్గాల ప్రజల అభ్యున్యతికి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అతి తక్కువ కాలంలో అతి పెద్ద సంక్షేమ ఫలాలు తెలంగాణలో అందుతూ దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించారు. గత ఆరేళ్ల కేసీఆర్‌ పాలన జనరంజకమన్నారు. రైతులు, పేదలను రెండు కళ్లుగా భావిస్తున్నారన్నారు. డబుల్‌ బెడరూం పథకం దేశంలోనే అద్భుత పథకమన్నారు. 24 గంటల ఉచిత కరెంటును సీంఎ రైతులకు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ధీమాగా రూ. 5 లక్షల భీమా అందిస్తున్నారన్నారు. కేవలం ఆరేళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, ఇకపై కూడా బంగారు తెలంగాణ ఆవిష్కారం కావాలన్నారు. చివరగా తెలంగాణ ప్రజలకు మంత్రి రాష్ట్ర ఆవిర్భవ శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు