వర్గీకరణ చేసి తీరుతాం

28 Nov, 2016 02:38 IST|Sakshi
వర్గీకరణ చేసి తీరుతాం
  • అప్పుడే మాదిగ కులాలకు న్యాయం
  • ధర్మయుద్ధం మహాసభలో వెంకయ్యనాయుడు
  • వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది
  • మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం
  • నేను ముందుండి నడిపిస్తా.. అవసరమైతే పోరాటం చేస్తా
  • నోట్ల రద్దు సమస్య పెద్దగా లేదు
  • ఉంటే ఈ సభకు ఇంతమంది వచ్చేవారే కాదు
  • పార్లమెంట్‌లో వర్గీకరణపై బిల్లు పెడితే మద్దతు: సురవరం
  • సాక్షి, హైదరాబాద్
    ‘‘రాజ్యాంగం హక్కులు కల్పించినా మాదిగ కులాలకు ఆ ఫలాలు అందలేదు. దీంతో ఆ కులాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనకబడ్డాయి. ఆ కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి. అయితే వర్గీకరణ అంశం సులువైంది కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలి. ఈ ప్రక్రియను నేను ముందుండి నడిపిస్తా. అవసరమైతే పోరాటం చేస్తా..’’అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌‌సలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
     
    ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నేను మాట్లాడితే కొన్ని వర్గాలు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. దళిత కులాలను విభజిస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ నేను వర్గీకరణ ప్రక్రియను తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలన్న సందర్భంలో కొన్ని వర్గాలు హిందువులను విభజిస్తున్నారంటూ గోల చేశాయి. కానీ రిజర్వేషన్లు జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది’’అని వెంకయ్య అన్నారు.

    ఎన్డీఏ ప్రభుత్వం కులాల మధ్య గొడవలు పెట్టడం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేస్తుందని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘నెల్లూరుకు వాజ్‌పేయి వచ్చినప్పుడు నేను మైకు పట్టుకుని ప్రకటనలు చేశా.. కానీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పెద్దగా ఆయన పక్కన కూర్చున్నా. నేనెప్పుడూ అంతటి స్థానం అందుకుంటానని ఊహించలేదు. వర్గీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తే మాదిగ ఉపకులాల ప్రజలు కూడా అత్యున్నత స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా తీసుకొచ్చేందుకు అన్ని పార్టీల సమ్మతికి ప్రయత్నిస్తా. మాదిగ కులాల కలలను సాకారం చేస్తా. బిల్లుకు సరికొత్త రూపు తీసుకొస్తా’’అని చెప్పారు.