విషాదం : కుటుంబంపై విషం చిమ్మిన కట్లపాము

24 Aug, 2019 08:39 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : అత్యంత ప్రమాదకరమైన ఓ పాము ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులపై విషం చిమ్మింది. గాఢ నిద్రలో ఉండగా కాటు వేసింది. వారిలో ఒకరు ప్రాణాలు విడువగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో చోటుచేసుకుంది. వివరాలు... జాతోట్‌ రవి (38), అతని భార్య, కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఐదడుగుల కట్లపాము గత రాత్రి ముగ్గురినీ కాటు వేసింది.  భర్త జాతోట్‌ రవి మృతి చెందగా.. భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి వారిని తరలించారు. కట్లపాము అత్యంత విషపూరితమైందని స్నేక్‌ క్యాచర్లు చెప్తున్నారు.

మరొకరు బలి...
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్య దేవిపల్లి గ్రామంలో పాముకాటుతో గంగారపు వెంకన్న అనే వ్యక్తి మరణించాడు. ముడురోజులక్రితం బోడ కాకరకాయలు కోస్తుండగా పాము కాటేసింది. చికిత్స నిమిత్తం బంధువులు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటిక్రితం మృతి చెందినట్లుగా సమాచారం. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పాము కాటుకు గురవడం. వారిలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. పాము కాటుతో ఒకే రోజు రెండు మరణాలు సంభవించడంతో కలకలం రేగింది.

మరిన్ని వార్తలు