ప్రారంభమెన్నడో..?

4 Sep, 2018 12:59 IST|Sakshi

నల్లగొండ అగ్రికల్చర్‌ : పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ఏడాది కావస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పాడిగేదెలు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలను నిత్యం వైద్యసేవల కోసం ఆస్పత్రికి తీసుకువస్తుంటారు. ఇంతకాలం సరైన సౌకర్యాలు లేకపోవడంతో సేవలు సరిగా అందించలేక సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో బహుళార్థక పశు వైద్యశాల నిర్మాణానికి 2016లో ఆర్‌ఐడీఎఫ్‌ పథకం కింద రూ. ఐదు కోట్ల నాబార్డ్‌ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.  మూడంతస్తుల్లో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించడంతోపాటు, ఆధునిక పరీక్షల కోసం ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్, ఆపరేషన్‌ థియేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇన్‌పేషెంట్, అవుట్‌ పేషెంట్‌ విభా గాలను నిర్మించారు. చిన్న, పెద్ద జంతువులకు అన్ని రకాల వైద్యసేవలను అందించడంతోపాటు ఇన్‌పేషెంట్‌ సేవలకు అవసరమైన సిబ్బందిని సైతం నియమించారు. ఆపరేషన్‌ థియేటర్‌కు పశువులను తీసుకెళ్లేందుకు లిఫ్ట్‌ ఏర్పాటు కోసం అవసరమైన నిధులను మంజూరు చేశారు.

చర్యలు తీసుకోని అధికారులు
జిల్లా వ్యాప్తంగా తెల్ల పశువులు 1.20 లక్షలు, నల్ల పశువులు 4.10 లక్షలు, మేకలు, గొర్రెలు 12 లక్షలు, కోళ్లు మూడు కోట్లు, పెంపుడు కుక్కలు 12 వేల వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తే వాటన్నింటికి కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అం దే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాణం పూర్తయినా ఆస్పత్రిని ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పశు వైద్యశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

భవనాన్ని అప్పగించగానే ప్రారంభిస్తాం 
బహుళార్ధ పశువైద్యశాల నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. భవన నిర్మాణం పూర్తి కాగానే మాకు అధికారికంగా అప్పగించాలి. కానీ ఇప్పటివరకు భవనాన్ని అప్పగించలేదు. అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి ప్రారంభమైతే జిల్లాలోని మూగజీవాలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.– డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఇన్‌చార్జి జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ అధికారి 

మరిన్ని వార్తలు