గజదొంగను గద్దె దింపాలి : విజయశాంతి

4 Dec, 2018 18:56 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : కేసీఆర్‌ కుటుంబంలోని నలుగురు కలిసి నాలుగు కోట్ల ప్రజానికాన్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రచార తార విజయశాంతి ఆరోపించారు. మహాకూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆమె మిర్యాలగూడలో జరిగిన రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల నెత్తురు కూడు తింటూ కుటుంబ పాలన చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో అధికారం కోసం కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చారని, నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా అమలుచేయలేదని అన్నారు.

కొడుకుని సీఎం చేయాలనే ఆర్భాటం తప్ప మరో ఆలోచనే కేసీఆర్‌కు లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపడానికే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆమె వివరించారు. రాహుల్‌ గాంధీది సింప్లిసిటీ అని, కేసీఆర్‌ది పబ్లిసిటీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ లాంటి గజదొంగను గద్దె దింపాలని ఆమె పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు